నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే నేరగాళ్లపై నిజామాబాద్ పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. వరుస నేరాలతో చెలరేగిపోతున్న నాగారం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ మహమూద్ బేగ్ అలియాస్ ఫిద్దును జిల్లా నుండి బహిష్కరిస్తూ l నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యసంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారానికి చెందిన ఫిద్దు అనే రౌడీ షీటర్ చరిత్ర అంతా రక్తం, దాడులు, మోసాలతో నిండి ఉంది. ఇతనిపై గతంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ (302 IPC) కేసుతో పాటు, హత్యాయత్నాలు, మోసాలు, ఆయుధాల చట్టం కింద అనేక కేసులు నమోదయ్యాయనీ తెలిపారు.
ఫిద్దుపై ఉన్న ప్రధాన కేసుల చిట్టా:
ఎడపల్లి (2023), టౌన్-V (2019) పరిధిలో మారణాయుధాలతో దాడులు. మోర్తాడ్, వర్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 420 కింద కేసులు.ఇటీవల 2025లో పితలాం (కామారెడ్డి), నవీపేట్ మరియు టౌన్-V పరిధిలో కొత్త నేర చట్టం కింద పదునైన ఆయుధాలతో దాడులకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయనీ పేర్కొన్నారు.
ఎన్నిసార్లు జైలుకు వెళ్లొచ్చినా రౌడి షీటర్ ఫిద్దు తీరులో మార్పు రాకపోవడంతో పాటు, సామాన్య ప్రజలను వేధిస్తున్నాడన్న ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ కఠిన నిర్ణయం తీసుకున్నారనీ అన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇతడిని జిల్లా సరిహద్దుల వెలుపలికి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సోమవారం ఐదవ టౌన్ పోలీసులు ఫిద్దుకు ఈ బహిష్కరణ నోటీసులను అందజేసి, తక్షణమే జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు.
