మీలాద్ ఉన్ నభి సందర్భంగా బుధవారం నిజామాబాద్ నగరంలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ర్యాలీ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మంగళవారం ర్యాలీ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ర్యాలీ ప్రారంభం, కొనసాగే మార్గం, ముగింపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ.. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ర్యాలీ సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించాలని సీపీ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని, ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
మహిళలు, వృద్ధులు, చిన్నారులు, అత్యవసర సేవల వాహనాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాలీ నిర్వాహకులు పోలీసులకు ముందుగా తెలిపిన మార్గంలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలని సీపీ స్పష్టం చేశారు.
అనుమతించిన సమయం, నిబంధనలు పాటించాలని, రెచ్చగొట్టే నినాదాలు, వివాదాస్పద చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీసుల సూచనలకు నిర్వాహకులు, ర్యాలీలో పాల్గొనే వారు సహకరించాలని కోరారు.విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది ముందుగానే తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకుని అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సీపీ ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ర్యాలీ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, సౌత్ రూరల్ సీఐ సురేష్కుమార్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ర్యాలీ నిర్వాహకులు పాల్గొన్నారు.
