ఈ కప్ను రెండో సారి సగర్వంగా ముద్దాడింది భారత్ జట్టు. దక్షిణాఫ్రికాతో జరిగిన నరాలు తెగే ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి మరోసారి విశ్వవిజేతగా అవతరించింది.
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓటమిని అందుకుంది.లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితం అయింది.
ఆ జట్టులో క్లాసెన్ (52: 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగాడు. క్వింటన్ డికాక్ (39: 31 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), స్టబ్స్ (31: 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, బుమ్రా 2, అర్ష్దీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్ విరాట్ కోహ్లీ (76; 59 బంతుల్లో 6×4, 2×6) అదరగొట్టాడు.
అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో 1×4, 4×6) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (9) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. మహరాజ్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఒక్క బంతి వ్యవధిలోనే తొలి డౌన్లో వచ్చిన రిషభ్ పంత్ (0) పరుగులేమీ చేయకుండానే డికాక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
అప్పటికి జట్టు స్కోరు కేవలం 23 పరుగులు మాత్రమే.అనంతరం స్వల్ప వ్యవధిలోనే సూర్యకుమార్ యాదవ్ (3) రబాడా బౌలింగ్లో షాట్కు ప్రయత్నించి క్లాసెన్ చేతికే చిక్కిపోయాడు.
దీంతో ఐదు ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం వల్ల భారత క్రికెట్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అప్పుడే క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(47)తో కలిసి విరాట్ కోహ్లీ(76) చక్కటి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకొని వీలుచిక్కినప్పుడల్లా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదేశారు.
దీంతో టీమ్ ఇండియాకు కాస్త స్వాంతన దక్కింది. అయితే, హాఫ్ సెంచరీకి చేరువలో సమన్వయ లోపంతో అక్షర్ పటేల్ రనౌట్గా పెవిలియన్ చేరాడు. చివర్లో శివమ్ దూబె (27; 16 బంతుల్లో 3×4,1×6) మెరుపులు మెరిపించాడు.
దీంతో టీమ్ ఇండియా మంచి స్కోరు చేసింది. జడేజా (2), హార్దిక్ పాండ్య (5*) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మార్కో యాన్సెన్, రబాడ చెరో వికెట్ తీశారు.
