నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర కుల గణన సన్నాహాలు మొదలయ్యాయి. ప్రభుత్వం బుదవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన మొదలు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ సర్వేలో నిమగ్నమైంది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి..
తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేయడమే ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాల్లో పక్కాగా సర్వే నిర్వహించేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు.
అయితే జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే కోసం మొత్తం 3245 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో పొల్గొనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఆర్మూర్ డివిజన్లో 934 ఎన్యుమరేటర్లు సర్వే చేస్తారు. బోధన్ డివిజన్లో 564 ఎన్యుమరేటర్లు సర్వే చేస్తారు. నిజామాబాద్ డివిజన్లో 715 మంది ఎన్యుమరేటర్లు సర్వే చేస్తారు.
ఈ సమగ్ర సర్వేను ఈనెల 24 వ తేదీ లోపు పూర్తి చేసేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. ఇందుకోసం సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ పూర్తి అయ్యింది. ఇందులో భాగంగా కుటుంబ సర్వేలో మొత్తము 56 ప్రశ్నలు ఉండగా, వాటికి తోడుగా మరో 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి.
మొత్తం 75 ప్రశ్నలతో ప్రతి కుటుంబానికీ చెందిన సమాచారాన్ని ఎంపిక చేసిన ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు. ఆ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఎన్యూమరేటర్లదే. ఆపరేటర్తో ఆన్లైన్లో నమోదుచేయించే సందర్భంలోనూ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
ఈ సర్వేలో సామాజిక, ఆర్ధిక, స్థిరాస్తులు, చరాస్తుల వివరాలు సైతం సేకరిస్తారు.సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని అంశాలతో పూర్తి వివరాలను సేకరించునున్నారు.
ఇంటింటికి తిరుగుతూ పూర్తి వివరాలను సేకరిస్తూ, గోప్యంగా భద్ర పరచనున్నారు. నిర్ణీత కాల వ్యవధి లోపు ఇళ్ల జాబితా రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసి ఎన్యుమరేషన్ బ్లాక్ లను గుర్తించారు. 150 ఇళ్లకు ఒక ఎన్యుమరేషన్ బ్లాక్ గా విభజించారు.
అందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధం చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను సర్వేలో భాగస్వాములు కానున్నారు. ఏకకాలంలో సర్వే డేటా ఎంట్రీ సమాంతరంగా జరగనుంది.
ఏ ఒక్క ఇల్లు తప్పిపోకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు మధ్యహ్నం ఒంటి గంట అనంతరం సర్వే చేపట్టనున్నారు. సర్వే సందర్భంగా సేకరించిన కుటుంబాల స్థితిగతులకు సంబంధించిన వివరాలను వెంటనే అదే రోజు ఆన్లైన్ లో నిక్షిప్తం చేసేలా సరిపడా సంఖ్యలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు.
ఇందులో వీరు పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి. సర్వేలో సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ, కుల సమాచారం సేకరణ ఉంటుంది. పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు.
ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు ఉండనున్నాయి. సర్వే సందర్భంగా ఫొటోలు తీయడం – పత్రాలు తీసుకోవడం లాంటివి ఉండవు. కుటుంబం మొత్తం ఉండాల్సిన అవసరం లేదు.
